
- నీటి ప్రవాహంపై అధ్యయనం
- తవ్వకాల్లో కీలకంగా మారుతున్న ఎస్కవేటర్లు
నాగర్ కర్నూల్/అచ్చంపేట,వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చివరి పాయింట్కు చేరుకున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ సభ్యులు మంగళవారం 13.600 కిలోమీటర్ల నుంచి 13.900 కిలోమీటర్ల వరకు సర్వే నిర్వహించారు. మట్టి నమూనాలు సేకరించడంతో పాటు నీటి ప్రవాహంపై అధ్యయనం చేశారు. ప్రమాదం జరగకుండా సింగరేణి టీమ్స్ దుంగలతో ఎనిమిది చోట్ల కాగ్స్ ఏర్పాటు చేశారు.
మట్టి, రాళ్లు తొలగించడంలో ఎస్కవేటర్లు, జేసీబీలు కీలకంగా మారుతున్నాయి. టీబీఎం ప్లాట్ఫాంతో పాటు 65 మీటర్ల టెయిల్ ఎండ్ భాగాన్ని కట్ చేశారు. డి1, డి2, ఎ5 ప్రాంతాలు, టీబీఎం చుట్టుపక్కల సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సభ్యులు మట్టిని తవ్వుతున్నారు. నీళ్లను తోడేసేందుకు ఎక్కడికక్కడ జెట్ మోటార్లు ఏర్పాటు చేశారు.
కేరళ క్యాడవర్ డాగ్ స్క్వాడ్ మంగళవారం టన్నెల్లో సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. జీఎస్ఐ ఆఫీసర్లు14 కిలోమీటర్ల టన్నెల్ పైభాగంలోని నల్లమల అటవీప్రాంతంలో సర్వే నిర్వహించారు. టన్నెల్ లోకి గ్రౌండ్ వాటర్తో పాటు పైనుంచి నీళ్లు వస్తున్నాయా? అనే అంశంపై ఫోకస్ చేశారు.
టన్నెల్లోకి వెళ్లిన జీఎస్ఐ టీమ్ టన్నెల్ నిర్మాణం, భూమి పొరల్లో మార్పులు, టన్నెట్ లోపల మట్టి ఘన స్థితి, నీటి ప్రవాహం ప్రభావంపై విశ్లేషించారు. ఈ టీమ్ అధ్యయనం అనంతరం రెస్క్యూ ఆపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మరింత ఎఫెక్టివ్గా పని చేసేందుకు పలు సూచనలు చేశారు.
మెషీన్లతో పనులు..
డిజాస్టర్ మేనేజ్మెట్ స్పెషల్ చీఫ్ సెకరెట్రీ అర్వింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తదితరులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న వివిధ సంస్థల ప్రతినిధులు, ఇంజినీర్లు, జియోలాజిస్టులతో చర్చించారు. రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెషినరీతో పని చేయించాలని నిర్ణయించారు. హిటాచీ, ఎస్కవేటర్లు, జేసీబీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
జీఎస్ఐ, సిస్మాలజీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్లానింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మెషీన్లు, సెన్సార్లు వినియోగిస్తున్నారు. టీబీఎం ప్లాట్ఫాం తొలగించి డి1, డి2, ఎ5 ప్రాంతాల్లో మట్టిని తవ్వితే మృతదేహాల ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉంటుందన్న అంచనాతో మెషినరీల సంఖ్య పెంచుతున్నారు. ర్యాట్ హోల్ మైనర్ల టీం టన్నెల్ చివరి భాగంలో 13.900 కిలోమీటర్ల వద్దకు చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు లాస్ట్ పాయింట్లో వాటర్ ప్రెషర్ను పరిశీలించాయి.